న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు మిస్ కావద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్థన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండో డోస్ వ్యాక్సిన్ తర్వాతే కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని అన్నారు. కేంద్ర మంత్రుల బృందంతో శనివారం సమావేశమైన ఆయన దేశంలో కరోనా పరిస్థితిపై వారితో చర్చించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 16.73 కోట్ల డోసుల టీకాలను ప్రజలకు వేసినట్లు హర్ష వర్థన్ తెలిపారు. మొత్తంగా 17,49,57,770 డోసుల వ్యాక్సిన్లు రాష్ట్రాలకు పంపినట్లు చెప్పారు. ఇందులో 16,65,49,583 డోసులు వినియోగించగా 84,08,187 డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నాయని వివరించారు. వీటికి తోడు 53,25,000 డోసుల టీకాలను రాష్ట్రాలకు త్వరలో సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. గత వారం రోజుల్లో 180 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు.