హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా సీమ ఎత్తిపోతల పథకం పనులను సందర్శించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఆగస్టు 9వ తేదీలోగా నివేదిక అందజేయాలని సూచించింది. తామే స్వయంగా నివేదిక అందజేస్తామన్న ఏపీ వాదనలను తోసిపుచ్చింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారంటూ మరోసారి మండిపడింది. ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల్లేకుండానే సీమఎత్తిపోతల పథకాన్ని ప్రకటించడమే గాకుండా, ప్రాజెక్టు పనులను చేపట్టింది. దీనిపై గవినోళ్ల శ్రీనివాస్ దాఖలుచేసిన పిటిషన్ను విచారించిన ఎన్జీటీ చైన్నై బెంచ్.. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తిస్థాయి నివేదికను అందించాలని కేఆర్ఎంబీని గతంలోనే ఆదేశించింది. తాజాగా ఆ పిటిషన్పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం మరోసారి విచారణ చేసింది. ప్రాజెక్టు సందర్శనకు తమ బృందం సిద్ధంగా ఉన్నా, ఏపీ ప్రభుత్వం సాకులు చెప్తూ వాయిదావేస్తూ వస్తున్నదని, నోడల్ అధికారిని కూడా నియమించడం లేదని కేఆర్ఎంబీ ఎన్జీటీకి నివేదించింది. ప్రాజెక్టు సందర్శనకు కేఆర్ఎంబీ బృందం అక్కర్లేదని.. అక్కడి తాజా పరిస్థితులపై తామే స్వయంగా నివేదికను అందిస్తామని ఏపీ సర్కార్ తన వాదనలను వినిపించింది. అదీగాక ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి కావాల్సిన అధ్యయనం మాత్రమే చేస్తున్నామని తెలిపింది. సీమ ప్రాజెక్టును ఎన్జీటీ బృందమే నేరుగా సందర్శించాలని, అందుకు హెలికాప్టర్తోపాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తామనితెలంగాణ ప్రభుత్వం విన్నవించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
ప్రాజెక్టు పనులపై తనిఖీలు ఇప్పుడే వద్దంటూ వాదనలు వినిపించిన ఏపీపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నిబంధనలు ఉల్లంఘించి పనులు జరుపుతారని భావించడం లేదని.. ఒకవేళ అదే జరిగితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పూర్తిస్థాయి నివేదికను ఆగస్టు 9వ తేదీలోగా అందజేయాలని, అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని కేఆర్ఎంబీకి ఎన్జీటీ స్పష్టంచేసింది. విచారణను 9వతేదీకి వాయిదా వేసింది. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ బెంచ్ పలుమార్లు తీవ్రంగా హెచ్చరించింది.
చెరో రూ.200 కోట్లు ఇవ్వండి
ఏపీ, తెలంగాణకు జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ లేఖలు
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర గెజిట్లో పేర్కొన్న ప్రకారం ఒక్కొక్క రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున తమకు నిధులు సమకూర్చాలని కృష్ణానదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ), గోదావరినదీ యాజమాన్యబోర్డు (జీఆర్ఎంబీ)లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం విడివిడిగా లేఖలు రాశాయి. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్రం ఇటీవల ఈ బోర్డుల అధికార పరిధిలను నిర్దేశిస్తూ గెజిట్ను విడుదల చేసింది. దీని ప్రకారం బోర్డుల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలను రెండు రాష్ర్టాలు భరించాల్సి ఉంటుంది.