చెన్నై: స్వతంత్ర తమిళ దేశాన్ని కోరుకునేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించవద్దని డీఎంకే నేత ఏ రాజా హెచ్చరించారు. ప్రత్యేక తమిళనాడు కోసం పెరియార్ బాటలో నడిచేలా తమను నెట్టవద్దని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సూచించారు. తమిళనాడు రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, నీలగిరి ఎంపీ అయిన ఏ రాజా, నమక్కల్లో జరిగిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించారు. ద్రావిడ ఉద్యమ ఐకాన్ తంథై పెరియార్ తన మరణం వరకు స్వతంత్ర తమిళనాడు కోసం నిలబడినప్పటికీ, డీఎంకే దానికి దూరంగా ఉందని తెలిపారు. పెరియార్ వాదనను పార్టీ అంగీకరించినప్పటికీ, దేశ సమగ్రత, ప్రజాస్వామ్యాన్ని సమర్థించిందని గుర్తు చేశారు. ‘భారతదేశం చిరకాలం వర్ధిల్లాలి’ అని డీఎంకే ఆకాక్షించిందని, ఆ పంథాకు కట్టుబడి తమ పార్టీ కొనసాగుతున్నదని అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఏ రాజా ఒక అభ్యర్థన చేశారు. ‘అమిత్ షా, ప్రధాన మంత్రి (నరేంద్ర మోదీ)కి అత్యంత వినయంతో చెబుతున్నా. వేదికపై ఉన్న మా నాయకుల (సీఎం స్టాలిన్) సమక్షంలో నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం సీఎన్ అన్నాదురై మార్గంలో మా సీఎం ప్రయాణిస్తున్నారు. మమ్మల్ని పెరియార్ మార్గంలోకి నెట్టవద్దు. ప్రత్యేక దేశం కోరేలా మమ్మల్ని చేయవద్దు. రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి ఇవ్వండి. అప్పటి వరకు మేం విశ్రమించం’ అని అన్నారు. తమిళనాడులో తమ పాలన ఉన్నందున అహంకారంతో ఇలా మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక తమిళనాడు డిమాండ్ను డీఎంకే విరమించుకుందని, ఇప్పుడు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని మాత్రమే డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు.
Namakkal, TN | Periyar, father of our philosophy, till his death asked for a separate Tamil Nadu. Our CM (MK Stalin) is moving on Anna (Annadurai) way, don't make us choose Periyar way. I request you to give us state autonomy: DMK MP A Raja pic.twitter.com/5lEF4ZoIIC
— ANI (@ANI) July 4, 2022