న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని, తమిళనాడులోని అధికార డీఎంకే ఎంపీ కనిమోళి గురువారం ఢిల్లీలో కలిశారు. టీఎంసీ ఎంపీ అభిషేక్బెనర్జీ నివాసంలో ఆమెతో సమావేశమయ్యారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలన్న అంశంతోపాటు పెగాసస్ వివాదంపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మూడవ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నది. అయితే దీనికి ఒక రూపు ఇచ్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ టూర్ సందర్భంగా పలువురు ప్రతిపక్ష పార్టీల ప్రముఖులతో ఆమె భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో బుధవారం మమత సమావేశమయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరి కొందరు నేతలతో కూడా ఆమె సమావేశం కానున్నారు.