చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కోటి నిధులను విరాళంగా ఇచ్చింది. డీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేసింది. తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. ‘భారీ వర్షాలు, వరదలతో కేరళలోని మా సోదరులు ప్రభావితమయ్యారు. మానవత్వం చూపుదాం. అవసరమైన ఈ సమయంలో వారికి మద్దతు ఇద్దాం’ అని అందులో పేర్కొన్నారు. కాగా, కేరళలో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో 20 మందికిపైగా మరణించారు.