న్యూఢిల్లీ: భారత్-అమెరికా దేశాల బంధం బలమైనదని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా కీలక భూమిక పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వంపట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు చేరుకున్న బ్లింకెన్, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు. కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే కార్యాచరణ, ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం పెంచుకోవడంపై భారత నాయకత్వంతో బ్లింకెన్ చర్చించారు. ‘ప్రాథమిక స్వేచ్ఛ, మానవ హక్కులను అమెరికా గౌరవిస్తుంది. మేం భారత్ను కూడా ఇదే కోణంలో చూస్తాం. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నది’ అని వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల సంబంధాల ప్రాముఖ్యతపై మాట్లాడిన బ్లింకెన్.. భారత్, అమెరికా మధ్య సంబంధాలతో పోలిస్తే ఇటువంటివి విశ్వవ్యాప్తంగా కొన్ని దేశాలకే పరిమితమైనవని అన్నారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అమెరికా విదేశాంగ విధానంలో అతి ప్రధానమైనదని ఆంటోని బ్లింకెన్ స్పష్టంచేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి.