న్యూఢిల్లీ, జూలై 19: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు సోమవారం ఉభయ సభలు విపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. లోక్సభ, రాజ్యసభలో గందరగోళంతో కొత్త కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్రమోదీ పరిచయం చేయలేకపోయారు. మంత్రులను సభలకు పరిచయం చేసేందుకు ప్రధాని నిల్చోగానే ప్రతిపక్షాల సభ్యులు వివిధ అంశాలపై నినాదాలు చేయడం ప్రారంభించారు. కొత్త మంత్రి నితీశ్ ప్రమాణిక్ జాతీయత అంశాన్ని కూడా లేవనెత్తాయి. ఆయన బంగ్లాదేశ్కు చెందినవారంటూ విపక్షాలు ఆరోపించాయి. అయితే ఆ ఆరోపణలు నిరాధారమని ప్రభుత్వం కొట్టివేసింది. పలు విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో ప్రధాని మండిపడ్డారు. పెద్దసంఖ్యలో మహిళలు, దళితులు, ఎస్టీలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ప్రతిపక్షాలు సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి నెగెటివ్ మనస్తత్వాన్ని సభలో ఎప్పుడూ చూడలేదని విపక్షాలను విమర్శించారు. సోమవారం రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది.