గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి పువ్వాడ
అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ విమర్శ
కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్లో చేరుతున్నారని స్పష్టీకరణ
ఖమ్మం, జూన్ 3: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మంది కాంగ్రెస్ కుటుంబాల వారు గురువారం టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి అజయ్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఇస్సాక్ షేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫరీద్ ఖాద్రీతోపాటు 200 మంది టీఆర్ఎస్లోకి వచ్చారు. గులాబీ పార్టీలోకి వచ్చిన వారిలో సోమనబోయిన స్వర్ణ, తోడేటి వసంత, కాంగ్రెస్ మైనార్టీ సెల్ నేతలు సయ్యద్ జిలానీ, ఎస్కే.జానీ, ఎండీ కరీం, సాజిదాబేగం, షామిమ్, గౌస్, ఖాద్రి, సయ్యద్ ఇస్మాయిల్, ఫసిద్దీన్, ఎస్టీ సెల్ నేత శ్రీనివాసరావు, ఇతర నాయకులు రవి, చైతన్య యాదవ్, చిర్రా హనుమంతరావు, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్లో గుర్తింపు లేదన్నారు. కేసీఆర్ పాలన నచ్చిన ప్రజలు అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఖమ్మం నగరంలో గతంలో వారు చేసిన అభివృద్ధిని చెప్పలేకపోతున్నారని, కానీ అబద్ధాలు చెప్పడంలో ముందు వరుసలో ఉంటున్నారని విమర్శించారు. రూ.వేల కోట్లతో ఖమ్మం రూపురేఖలు మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు, కార్పొరేటర్ కమర్తపు మురళి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.