న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ పథకంలో ప్రతి పౌరుడికీ డిజిటల్ హెల్త్ ఐడీ ఇస్తామని, ఇది వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. ‘ఈ పథకంలో పౌరుల ఆరోగ్య వివరాలు, రికార్డులను డిజిటలైజ్ చేస్తారు. పేషెంట్ల అనుమతితో దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న వైద్యులైనా వాటిని పరిశీలించే అవకాశం ఉంటుంది. తద్వారా వైద్య సేవల విషయంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. హెల్త్ రికార్డులు సురక్షితంగా ఉంటాయ’ని చెప్పారు. ఈ పథకాన్ని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పౌరులకు ఇచ్చే హెల్త్ ఐడీ వారి ‘ఆరోగ్య ఖాతా’గా పనిచేస్తుంది. దానికి వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు లింక్ చేయవచ్చు. వాటిని మొబైల్ యాప్ ద్వారా చూడవచ్చు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్లో పేదలకు రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించామని ప్రధాని చెప్పారు. దీని కింద ఇప్పటి వరకు 2 కోట్ల మంది ప్రజలు ఉచితంగా వైద్యచికిత్స పొందారని, వారిలో సగం మంది మహిళలని తెలిపారు. ఇప్పుడు ప్రారంభించిన డిజిటల్ మిషన్ దేశవ్యాప్తంగా దవాఖానాలను అనుసంధానం చేస్తుందన్నారు. దీని ద్వారా ప్రజలకు వైద్య సేవలు క్లిక్ దూరంలో ఉంటాయని చెప్పారు. దేశంలో దాదాపు 130 కోట్ల మంది ఆధార్ యూజర్లు, 118 కోట్ల మంది మొబైల్ చందాదారులు, 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 43 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతాదారులు ఉన్నారని, ఇలాంటి అనుసంధానత ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు.
ఏమిటీ డిజిటల్ హెల్త్ ఐడీ?
ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయాలని 2017లో మొట్టమొదటిసారిగా నేషనల్ హెల్త్ పాలసీ సూచించింది. ప్రతీ పౌరుడికి ఒక డిజిటల్ హెల్త్ ఐడీ ఇవ్వాలని, దానిలో రోగి పూర్వ ఆరోగ్య రికార్డులు నిక్షిప్తం చేయాలని 2018లో నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. హెల్త్ ఐడీ వివరాలు అన్ని నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం) వద్ద భద్రంగా ఉంటాయి. అయితే, ఇది స్వచ్ఛందమైనది. ప్రతీ రోగి కచ్చితంగా హెల్త్ ఐడీ తీసుకోవాలని లేదు. ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. లేకపోతే లేదు. ఓ వ్యక్తి సాధారణ వివరాలు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ద్వారా హెల్త్ ఐడీని క్రియేట్ చేస్తారు.
విధానాల రూపకల్పనకు
ఒక వ్యక్తి/రోగి దవాఖానకు వెళ్లినప్పుడు అంతకుముందు చేసిన పరీక్షలు, చికిత్స వివరాలను వెంట తీసుకెళ్లాలి. దీనిని ప్రతీసారి తీసుకెళ్లడం కష్టం. అంతే కాకుండా కొన్ని రోజులకు అవి పాడైపోవచ్చు. ఈ నేపథ్యంలో రికార్డులను డిజిటలైజ్ చేసి హెల్త్ ఐడీ ఇస్తే దానిని ఎక్కడి నుంచై యాక్సెస్ చేయవచ్చు. వైద్యం అందించడం సులభం అవుతుంది. అంతే కాకుండా ఏ వ్యాధులు ఎక్కువగా, ఎక్కడ, ఏ కాలంలో వ్యాపిస్తున్నాయి అన్న సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. ఫలితంగా ఆరోగ్య రంగంలో మరింత ప్రభావంతమైన విధానాలకు రూపకల్పన చేయవచ్చు అన్నది ప్రభుత్వ భావన.
యూకేలో ఫెయిల్
2005లో యూకే నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) కూడా ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డుల వ్యవస్థను ప్రారంభించింది. 2010 కల్లా యూకే ప్రజలందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. అయితే తర్వాత మనసు మార్చుకొన్నది. డాటా నిర్వహణ, సమాచార భద్రత తదితర సవాళ్లతో వెనుకడుగు వేసింది. రూ.120 కోట్లకు పైగా ఖర్చు పెట్టాక కూడా ఈ ప్రాజెక్టును నిలిపివేయడం గమనార్హం.