న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ఐటీ చట్టం ప్రకారం ప్రభుత్వం ఎవరిపై నిఘా వేయాలన్నా ముందస్తు అనుమతి అవసరమని, కానీ మోదీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా పెగాసస్ స్పైవేర్తో న్యాయమూర్తులు, ఆర్మీ అధికారులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులపై నిఘా వేసిందని ఆయన ఆరోపించారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం ఇలాంటి చర్యకు పూనుకోదని ఖర్గే విమర్శించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రధాని నరేంద్రమోదీకి లేదని, అందుకు ఆయన ఏమాత్రం సిద్ధంగా లేరని మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. మేం ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం వెంటనే ఆల్పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే పెగాసస్ విషయంలో తామంతా (ప్రతిపక్షాలు) కలిసి ఉమ్మడిగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.