న్యూఢిల్లీ: డ్రోన్లు ఈజీగా లభించడం రక్షణ కేంద్రాలకు సవాల్ అని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, సైనిక కేంద్రాల సంరక్షణ పరిస్థితిని ఇది మరింత జఠిలం చేసిందని తెలిపారు. జమ్ము ఎయిర్బేస్పై ఆదివారం డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థల రక్షణాత్మక వినియోగంపై సైన్యం దృష్టిసారించిందని చెప్పారు. జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవడంతోపాటు ఉగ్రవాదుల నిర్మూలనపై ఆర్మీకి గట్టి పట్టు ఉన్నదన్నారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరత కోసం దీనిని కొనసాగిస్తామని తెలిపారు. జమ్ముకశ్మీర్లో శాంతి, అభివృద్ధి ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని ఆర్మీ చీఫ్ అన్నారు. అయితే ఉగ్రవాదుల చొరబాట్లు, ఉగ్రవాద చర్యలు గతం కంటే చాలా తగ్గాయన్నారు.