లండన్ వెళ్లే విమాన టికెట్ల ధరలను ఎయిర్లైన్ సంస్థలు భారీగా పెంచేశాయని ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లేందుకు ఎకానమీ క్లాస్ టికెట్ ధర దాదాపు 4 లక్షల రూపాయలకు పెంచేశారని.. ఎయిర్లైన్ సంస్థలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విమాన టికెట్ల ధరలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) మంగళవారం స్పందించింది. అలాగే విమాన ప్రయాణికులకు పలు సూచనలు చేసింది.
విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు విమాన టికెట్ల ధరల కోసం సంబంధిత ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్లలోనే చూసుకోవాలని డీజీసీఏ సూచించింది. గూగుల్, యాహూ, స్కైస్కానర్ వంటి మెటా సెర్చింజన్లలో వాస్తవమైన ధరలు ఉండకపోవచ్చని.. కాబట్టి వాటిని ఫాలో అవ్వద్దని కోరింది. ఆగస్టు నెలలో ఢిల్లీ నుంచి లండన్ మధ్య వెళ్లే విమాన టికెట్ ధర 1.03 లక్షల నుంచి 1.47 లక్షలు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే మెటా సెర్చ్ ఇంజిన్లలో ఒక్కోసారి ఎయిర్లైన్ వెబ్సైట్లలో ఉండే ధరల కంటే ఎక్కువ ధరలు చూపిస్తున్నాయని.. దీనివల్ల గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది. మెటా సెర్చ్ ఇంజిన్లలో విమాన టికెట్ ధరలు అధికంగా చూపించకుండా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఎయిర్లైన్ సంస్థలను డీజీసీఏ ఆదేశించింది.
బ్రిటీష్ ఎయిర్వేస్లో ఆగస్టు 26న ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే విమాన టికెట్ ధర గూగుల్ ట్రావెల్లో రూ.3.95 లక్షలుగా ఉందని ఐఏఎస్ అధికారి సంజీవ్ గుప్తా ఇటీవల ట్వీట్ చేశారు. ఇది ఫస్ట్ క్లాస్ టికెట్ కాదు.. కేవలం ఎకానమీ టికెట్ ధరనే అని ట్విటర్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పౌర విమాన శాఖ దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లారు. అయితే సంజీవ్ గుప్తా ట్వీట్ తర్వాత విమాన టికెట్ల ధరలపై భారీగా చర్చ మొదలైంది. బ్రిటన్లో కాలేజీల అడ్మిషన్ సీజన్ కావడంతో లండన్ వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో విమాన టికెట్ల ధరలను అమాంతం పెంచారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ దీనిపై క్లారిటీనిచ్చింది.