తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తోటి భక్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి కోరారు. కొవిడ్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకుని దర్శనానికి వస్తున్న వారి సంఖ్య బాగా తగ్గిందన్నారు. మే నెలలో రోజుకు 15 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశామని, చాలా తక్కువ మంది మాత్రమే బుక్ చేసుకున్నారని చెప్పారు.
జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నవారు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని కోరారు. దర్శ టికెట్లు రద్దు చేసుకునే వారు ఈ ఏడాది ఆఖరు వరకు తిరిగి దర్శనం పొందే అవకాశం కల్పించామన్నారు.
రెండు వారాల్లో ఉద్యోగులందరికీ వ్యాక్సిన్..
వచ్చే 2 వారాల్లో టిటిడి ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను చైర్మన్ ఆదేశించారు. కరోనా రెండో విడతలో ఇప్పటివరకు 15 మంది ఉద్యోగులు కొవిడ్తో మృతి చెందారని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
కరోనా వ్యాధితో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులకు అయ్యే వైద్యఖర్చులు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు. టిటిడి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బర్డ్ ఆసుపత్రిలో బెడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల నైవేద్యం..
పూర్వపు రోజుల తరహాలో తిరుమల శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం ఇతర ఉత్పత్తులతో నైవేద్యం పెట్టడాన్ని శనివారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని చైర్మన్ తెలిపారు. కృష్ణా జిల్లా పినగూడురులంకకు చెందిన రైతు విజయరామ్ సహకారంతో ఈ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.
భక్తుల క్యూలైన్ల పరిశీలన..
సమావేశం అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయంలోని క్యూలైన్లలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన కొవిడ్ ముందు జాగ్రత్త చర్యలను చైర్మన్ పరిశీలించారు.
ప్రత్యేక ప్రవేశ దర్మనం కాంప్లెక్స్, కంపార్ట్మెంట్లలో సోప్ లిక్విడ్, చేతి శానిటైజర్ల వినియోగం, స్కానింగ్ పాయింట్, మహద్వారం వద్ద ట్రై ఓజోన్ శానిటైజర్ పనితీరు, భక్తులు భౌతికదూరం పాటిస్తూ ఆలయంలోకి ప్రవేశించడం, పడికావలి వద్ద క్యూలైన్ క్రమబద్ధీకరణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కార్యక్రమాల్లో టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శివకుమార్, ఆలయ డిప్యూటీ ఈఓ హరీందర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు