18వ తేది జగద్గురువులు భగవద్రామానుజులవారి జయంతి
అగ్రగణ్యులైన భారతీయ జగద్గురువుల కోవలోకి చెందిన మహనీయుడు భగవద్రామానుజులు. తల్లిదండ్రులు ‘లక్ష్మణుడు’ అనే పేరు పెట్టినా తర్వాతి కాలంలో ‘యతిరాజులు’, ‘శ్రీభాష్యకారులు’, ‘ఎంబెరుమానార్’, ‘ఇళైయాళ్వార్’ వంటి పేర్లతో ప్రసిద్ధి చెందారు. క్రీ.శ. 1017 శ్రీ పింగళ నామ సంవత్సర చైత్రమాసంలోని శుక్లపక్షంలో ఆర్ద్రా నక్షత్రంతో కూడిన పంచమినాడు కర్కాటక లగ్నంలో ‘కాంతిమతి- కేశవాచార్యులు’ దంపతులకు పుత్రునిగా శ్రీరామానుజులు జన్మించారు.
నిరుపమాన ప్రతిభాశాలియైన శ్రీరామానుజులు బాల్యంలో భాగవత కథలను, ఆళ్వార్ల చరిత్రలను తెలుసుకుంటూ ఆనంద పరవశులయ్యేవారు. చిన్న వయసులోనే వేదాధ్యయనం చేసి, సంస్కృతభాషలో అపార పాండిత్యం సంపాదించారు. వేదార్థాలను వివరించగల సామర్థ్యాన్నీ పొందారు. విద్యాగురువు ‘యాదవ ప్రకాశులు’ కొన్ని సందర్భాల్లో ఉపనిషత్తు వాక్యాలకు అసమగ్రమైన అర్థాలను వివరిస్తున్నప్పుడు, రామానుజులు యథార్థమైన వివరణను, సమన్వయాన్ని అందించేవారు. ‘పెరియనంబి’, ‘గోష్ఠీ పూర్ణులు’, ‘తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్’, ‘తిరుమలై ఆండాన్’, ‘తిరుమల నంబి’ అనే అయిదుగురు ఆచార్యుల నుండి విశిష్టాద్వైత సిద్ధాంతానికి దోహదపడే తాత్తిక జ్ఞానాన్ని, శ్రీవైష్ణవ సంప్రదాయ రహస్యాలను మంత్రార్థాలతోసహా ఉపదేశంగా పొందారు.
శ్రీరంగక్షేత్రంలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయ వ్యాప్తికై అవిశ్రాంతంగా కృషి చేసిన ‘యమునాచార్యుల’వారి మూడు కోరికల మేరకు బ్రహ్మసూత్రాలకు నిష్పాక్షిక వ్యాఖ్యానాన్ని సిద్ధపరచడం, వ్యాస పరాశర మహర్షుల స్మరణ (స్మృతి)ను శాశ్వతంగా నిలుపడం, ‘నమ్మాళ్వార్ల తిరువాయ్ మొజి’ అనే ద్రావిడ ప్రబంధానికి వ్యాఖ్యను రచింపజేసి ఆ గ్రంథ ప్రశస్తిని విస్తృతంగా ప్రచారం చేయడం- అనే మూడు లక్ష్యాలను శ్రీరామానుజులు నెరవేర్చారు. తిరుమల కొండపై వెలసిన భగవంతునికి సంబంధించి కొనసాగుతున్న వాదవివాదాలకు స్వస్తి పలుకుతూ, వైకుంఠాధిపతియైన శ్రీహరియే శ్రీవేంకటేశ్వరుడని నిరూపించారు. ఆ క్షేత్రంలో పలు సంస్కరణలతో, నిర్మాణాలు జరిపించి, ఆరాధనా విధానాలను వ్యవస్థీకరించి, తమ శిష్యుడైన ‘అనంతాచార్యుల’ను శ్రీవేంకటేశ్వరుని సేవలో నియోగించారు. సుప్రసిద్ధ శ్రీవైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామికి అర్చనా విధానం ఏర్పరచడమేకాక ఉత్సవ నిర్వహణలోని లోపాలను సశాస్త్రీయంగా, సలక్షణంగా సంస్కరించారు.అనూహ్యపంథాలో ‘విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని’ వెలుగులోకి తెచ్చిన భగవత్ స్వరూపులు శ్రీరామానుజులు.
సముద్రాల
శఠగోపాచార్యులు
98483 73067