న్యూఢిల్లీ : ఢిల్లీలో మూడు రోజుల తర్వాత 18 నుంచి 44 ఏండ్ల వయసు వారికి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. 18-44 వయసు వారికి మరిన్ని వ్యాక్సిన్ల సరఫరా అవసరమని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేలో ఢిల్లీకి 3.83 లక్షల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా 18-44 ఏండ్ల గ్రూపునకు ఎలాంటి కేటాయింపులు లేవని చెప్పారు.
18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ల కేటాయింపు లేకుంటే రాబోయే మూడు రోజుల తర్వాత వ్యాక్సినేషన్ కేంద్రాలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కేటాయింపుల తరహాలో రాష్ట్రాలకు కేటాయించిన వ్యాక్సిన్ల వివరాలపై డేటా ప్రచురించాలని సిసోడియా కేంద్రాన్ని కోరారు.