హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2018లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవడానికి వైరస్ (డెన్వీ)లో వచ్చిన కొత్త వేరియంట్ ‘డెన్వీ-2’ కారణమని తేలింది. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ఏడాది తెలంగాణ నుం చి సేకరించిన నమూనాల్లో 34శాతం ఈ వేరియంట్ ఉన్న ట్టు నిర్ధారించింది. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మ్యాగజైన్ ప్రచురించింది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా 4,963 నమూనాలను పుణె ఎన్ఐవీ సేకరించింది. అందులో డెన్వీ-2 వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ రకం వల్ల తీవ్రమైన ఒంటి నొప్పులు, వాంతులు, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం, కడుపులో తీవ్రమైన నొప్పి, నీరసం, అంతర్గత రక్తస్రావం వంటివి ఎక్కువగా సంభవించినట్టు అధ్యయనంలో పేర్కొన్నది. 2018లో 6,362 కేసు లు నమోదు కాగా ఇద్దరు మరణించారు. 2019లో 13,361 కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు.