న్యూఢిల్లీ, ఆగస్టు 5: గత కొద్దిరోజులుగా తగ్గినట్టు కనిపించిన కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కొత్త వేరియంట్లతో స్వైరవిహారం చేస్తున్న ఈ విశ్వమారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20 కోట్ల మందికి సోకినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొత్త వేరియంట్లలో ‘డెల్టా’ రకం అత్యంత ప్రమాదకర స్థాయిలో 135 దేశాలకు వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. గత అంచనాలతో పోలిస్తే.. డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారినట్టు ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు తెలిపారు. ఈ వేరియంట్ను కట్టడి చేయాలంటే 80-90 శాతం మంది హెర్డ్ఇమ్యూనిటీ (సామూహికంగా రోగనిరోధక శక్తి) సాధించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు 60-70 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ సరిపోతుందని ప్రారంభంలో అంచనా వేశామని, అయితే, తమ అంచనాలకు మించి ‘డెల్టా’ వేరియంట్ రెట్టింపు వేగంతో వ్యాపిస్తున్నదని పరిశోధకుడు రిచర్డ్ ఫ్రాంకో తెలిపారు. 80 నుంచి 90 శాతం హెర్డ్ఇమ్యూనిటీ సాధిస్తేనే ‘డెల్టా’ వేరియంట్ను కట్టడి చేయవచ్చన్నారు. వ్యాక్సినేషన్ను అన్ని దేశాలు ముమ్మరం చేయాలని సూచించారు.
అందుకే తీవ్రత పెరిగింది
ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారడానికి గల కారణాలను చైనా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. బాధితుడి శరీరంలోకి ప్రవేశించిన డెల్టా వేరియంట్.. తనలాగే ఉన్న మరో వైరస్ను (ఇంకో డెల్టా వేరియంట్) అత్యంత స్వల్ప వ్యవధిలో సృష్టిస్తున్నట్టు చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకులు తెలిపారు. కరోనా ప్రారంభంలో సోకిన వైరస్ రకంతో పోలిస్తే ‘డెల్టా’ వైరల్లోడ్ వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఈ వేరియంట్ సులభంగా, అత్యంత వేగంగా వ్యాపిస్తూ.. ప్రమాదకరంగా మారినట్టు వెల్లడించారు.
ఆగ్నేయం.. అల్లకల్లోలం
డెల్టా వేరియంట్ ఆగ్నేయాసియా దేశాల్లో కలవరం సృష్టిస్తున్నది. వైరస్ తొలిసారిగా వెలుగుచూసిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశంలోని 17 ప్రొవిన్సుల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ప్రఖ్యాత పర్యాటక నగరం ఝాంగ్జియాజీలో లాక్డౌన్ విధించారు. మరోవైపు, డెల్టా వేరియంట్ కారణంగా గత నెలలో వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు ఎప్పుడూ నమోదుకాలేదని అధికారులు తెలిపారు.
కేవలం 184 నమూనాల పరిశీలన
సెకండ్ వేవ్కు కారణమైన ‘డెల్టా’ వేరియంట్ ఉద్ధృతి భారత్లో ఇంకా కొనసాగుతున్నది. మరోవైపు, కొత్త వేరియంట్ల ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, వాటిని గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ సార్స్ కొవ్-2 జీనోమ్ కన్సార్టియమ్ (ఐఎన్ఎస్ఏసీవోజీ) మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాలను విశ్లేషించడంలో భాగంగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 15,546 నమూనాలపై ఐఎన్ఎస్ఏసీవోజీ గత ఏప్రిల్లో పరిశోధనలు నిర్వహించగా.. జూలైలో కేవలం 184 నమూనాలనే పరిశీలించింది.