ముంబయి : సౌదీ ఆరాంకోను రిలయన్స్ భాగస్వామిగా ముకేశ్ అంబానీ స్వాగతించారు. కింగ్డమ్ వెల్త్ ఫండ్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డైరెక్టర్, సౌదీ ఆరాంకో చైర్మన్గా ఉన్న యాసిర్ అల్ రుమయ్యన్ ఇకపై రిలయన్స్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. యాసిర్ చేరిక రిలయన్స్ అంతర్జాతీయీకరణకు ఉపకరిస్తుందని ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబయిలో గురువారం జరిగింది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా వర్చువల్ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి సౌదీ అరాంకో చైర్మన్కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతగా ఉంటామన్నారు. ఏడాదిగా రిలయన్స్ వ్యాపార వృద్ధి అంచనాలను మించినట్లు తెలిపారు. అయితే రిలయన్స్ లాభాల కన్నా సామాజిక సేవ తమకు సంతృప్తినిచ్చిందన్నారు.
గూగుల్-జియో సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ఫోన్ జియోఫోన్ నెక్ట్స్. సెప్టెంబర్ 10 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. జియోఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ ఓఎస్తో పనిచేయనున్నట్లు వెల్లడించారు. నవీ ముంబయిలో జియో ఇనిస్టిట్యూట్ స్థాపిస్తున్నట్లు ముకేశ్ చెప్పారు. జియో ఇనిస్టిట్యూట్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. జియో రాకతో డిజిటల్ అంతరాలు తొలగుతున్నాయన్నారు.
దేశవ్యాప్తంగా 21 వేల మంది పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఏర్పాట్లు చేశామన్నారు. మహిళా, బాలికల సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కరోనాను ఎదుర్కొనేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపిన ముకేశ్ అంబానీ మిషన్ ఆక్సిజన్ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేపట్టినట్లు వెల్లడించారు. జామ్నగర్లో రోజుకు 1100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేపట్టినట్లు చెప్పారు. 2030 నాటికి 100 గిగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.