బెంగళూర్ : సైనికాధికారిగా నమ్మబలుకుతూ ముగ్గురు మహిళలను పెండ్లి పేరుతో మోసగించిన యువకుడి(26)ని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు మిలటరీ క్యాంటిన్ నుంచి కార్లు, బైక్లు ఇప్పిస్తానని మరో ఆరుగురిని నిందితుడు రూ లక్షల్లో ముంచాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని నగరానికి చెందిన అంజనేష్గా గుర్తించారు. సైనికాధికారిగా చెప్పుకుంటూ పెండ్లి చేసుకుంటానని ముగ్గురు మహిళల నుంచి నిందితుడు రూ మూడు లక్షలు వసూలు చేశాడని చెప్పారు. నిందితుడి నుంచి నకిలీ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
అంజనేష్ తనను రూ 21 లక్షలు మోసం చేశాడని సుబ్రహ్మణ్యనగర్కు చెందిన మెడికల్ షాపు యజమాని ఎం ఈశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయని బెంగళూర్ డీసీపీ (నార్త్) ధర్మేందర్ కుమార్ తెలిపారు. మెడికల్ షాపు యజమానికి కారును తక్కువ ధరకు తీసుకురావడంతో పాటు సర్జికల్ గ్లోవ్స్ను సరఫరా చేస్తానని మోసగించాడని, మరికొందరు ప్రైవేట్ ఉద్యోగులకు సైతం కొత్త బుల్లెట్ బైక్ల పేరుతో ఎరవేశాడని వెల్లడించారు. విలాసాలకు అలవాటు పడిన నిందితుడు ఈ తరహా మోసాలకు తెగబడ్డాడని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.