రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నరు
తప్పు చేశానని ఒప్పుకొన్న రాజేందర్ను జైలుకు పంపాలి
డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్నేని సత్యనారాయణరావు
జమ్మికుంట,(జమ్మికుంట రూరల్), మే 2: మంత్రి ఈటల రాజేందర్కు బినామీలు చాలా మంది ఉన్నారని, జమ్మికుంటలోనూ ఉన్నారని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్నేని సత్యనారాయణరావు ఆరోపించారు. ఆదివారం జమ్మికుంటలోని పద్మశాలీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. జమ్మికుంటకు చెందిన ప్రముఖ వ్యాపారి బచ్చు భాస్కర్ ఈటల రాజేందర్కు బినామీగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. అతడు మంత్రి అండదండలతో జమ్మికుంటలో బ్యాంక్లోన్ తీసుకున్న చిన్నచిన్న వ్యాపారులను బ్యాంకర్లతో బెదిరింపజేస్తూ, ఆస్తులను అమ్ముకునే స్థితికి తెచ్చేవాడని, తర్వాత లోన్లు మాఫీచేయించినట్లు వ్యాపారులను నమ్మించి తిరిగి తనే వాటిని సొంతం చేసుకునేవాడని విమర్శించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మంత్రి బినామీలు ఎంతో మంది ఉన్నారని, వీరందరిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారి వివరాలను తాము కూడా తెలుసుకుంటున్నామని, త్వరలో ఆ పేర్లు బయటపెడతామని చెప్పారు.
ఈటలను జైలుకు పంపండి..
మంత్రి ఈటల రాజేందర్ మొన్న మీడియాతో మాట్లాడుతూ తప్పు చేశానని ఒప్పుకున్నాడని, కావున వెంటనే ఆయన్ను జైలుకు పంపించాలని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్నేని సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఆరెకరాల అసైన్డ్ భూమిని కొన్నానని చెప్పారని, అయితే 66 ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్నాడని నివేదికలు చెబుతున్నాయని.. మరి ఆరెకరాల భూమి కొని 60 ఎకరాలు కబ్జా చేశారా ? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు కొన్నానని స్వయంగా మీడియా ముందే చెప్పడం తప్పు ను ఒప్పుకున్నట్టేనని, ఈ క్రమంలో విచారణ అనేది లేకుండా అర్జెంట్గా అసైన్డ్ యాక్ట్ ప్రకారం ఒక సామాన్యుడి మీద ఏ చర్య తీసుకుంటారో, అలాగే ఈటలపైనా అదే చర్య తీసుకొని జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.
ఆయనపై వెంట నే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. తాను బీసీ బిడ్డను అని చెప్పుకొనే ఈటల రాజేందర్ ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములను ఆక్రమించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఒక సామాన్యుడు ఒక అరగుంటలో గుడిసె వేసుకుంటే అధికారులు వ చ్చి తొలగించి, అతన్ని అక్కడి నుంచి వెళ్లగొడుతున్నారని, అలాంటిది ఇవ్వాల ఈటల 66 ఎకరాల (సుమారు రూ.150-200 కోట్ల విలువ చేసే) భూమిని లాక్కున్నారని ఆరోపించారు. ఆయనపై సానుభూతిని వ్యక్తం చేయడం సరికాదని, కార్యక ర్తలు ఆలోచన చేయాలని కోరారు. తన తప్పును ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు ఉన్న మిగతావారిపైనా విచారణ చేయించాలని సీఎం కేసీఆర్ను కోరారు.