న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న సమయంలో ఊరట కలిగించేలా దక్షిణ ఢిల్లీలో ఏర్పాటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ (ఎస్పీసీసీసీ) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) నిర్వహించే ఈ దవాఖానను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీసీసీసీ సేవలు ప్రారంభమయ్యాయని, ఇప్పటివరకూ 25 మంది రోగులు రాగా, మరికొన్ని అడ్మిషన్లు జరుగుతాయని అంచనా వేస్తున్నామని ఐటీబీపీ ప్రతినిధి వివేక్ పాండే పేర్కొన్నారు.
500 పడకలతో కూడిన ఈ సెంటర్ లో త్వరలో మరిన్ని బెడ్స్ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. చత్తార్పూర్ లో నిర్మించిన ఈ దవాఖాన నిర్వహణకు ఐటీబీపీకి నోడల్ బాధ్యతలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్పగించింది. ఇక సోమవారం ఉదయం ఎస్పీసీసీసీని సందర్శించామని, 500 ఆక్సిజన్ పడకలతో ప్రారంభమైన ఈ కేంద్రంలో మరిన్ని పడకలను రాబోయే రోజుల్లో జోడిస్తారని, తాము కూడా 200 ఐసీయూ పడకలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఐటీబీపీ డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఈ సెంటర్ కు కేటాయించినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.