గ్రేటర్ ప్రజల తాగు, మురుగునీటి అవసరాలకు సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. జలమండలి సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 2381.52 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. బృహత్తర తాగు, మురుగునీటి ప్రాజెక్టులతోపాటు ఉచిత నీటి సరఫరా పథకాన్ని పకడ్బందీ అమలును ప్రోత్సహించింది. నూతన ఎస్టీపీలు, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి గ్రామాల ప్రజలకు సమృద్ధిగా నీటి సరఫరాకు 250కోట్లు కేటాయించారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలందించాలని నిర్ణయించిన అధికారులు తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల బలోపేతం, కొత్త వనరులతో నీటి ఎద్దడి నివారణకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేసిన జలమండలికి సర్కారు నిధుల వర్షం కురిపించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ అధికారులు దాదాపు 5500కోట్ల్లతో బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేయగా, 2381.52కోట్లు కేటాయించింది. కృష్ణా, గోదావరి, హడ్కో పథకం రుణాలకు 725కోట్లు, నూతన ఎస్టీపీలు, ఓఆర్ఆర్ తాగునీటి పథకం, ఇతరత్రా డెవలప్మెంట్ పనులకు 668 కోట్లు , సుంకిశాల ప్రాజెక్టుకు 725కోట్లు, ప్రతి నెలా ఇంటికి 20కెఎల్ ఉచిత నీటి సరఫరా పథకం మరింత పకడ్బందీగా అమలుకు 250కోట్లు కేటాయించారు.
గ్రేటర్ హైదరాబాద్లో ఉచితంగా నీటి పంపిణీ పథకం మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. నెలకు ఉచితంగా 20వేల లీటర్ల లోపు తాగునీటిని గృహ వినియోగదారులకు సరఫరా చేస్తామని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఈ పథకానికి వెనువెంటనే కార్యరూపంలోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ఫ్రీ వాటర్ పథకం ద్వారా 9,84,940 గృహ వినియోగదారులకు 480కోట్ల భారం నుంచి విముక్తి కల్పించింది. ఈ భారం జలమండలిపై పడకుండా ప్రభుత్వమే భరిస్తున్నది. ఇందులో భాగంగానే 250కోట్ల మేర కేటాయింపులు జరిపారు.