న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు దిగివస్తున్నాయి. దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. రోజువారీ తాజా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుమఖం పట్టడంతో ఢిల్లీ వాసులు అన్లాక్ ప్రక్రియ అమలు కోసం వేచిచూస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ వారాంతంలో జరిగే డీడీఎంఏ భేటీలో లాక్ డౌన్ నియంత్రణల సడలింపు, మార్కెట్లను తెరవడంపై కీలక నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు.
పాజిటివిటీ రేటు 1 శాతం లోపు దిగివస్తే లాక్ డౌన్ సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు మహమ్మారి వ్యాప్తితో ఢిల్లీని వీడిన వలస కూలీలు కేసుల తగ్గుదలతో అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో దేశ రాజధానికి తిరిగి చేరుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అన్లాక్ ప్రక్రియను ప్రకటించిన క్రమంలో తిరిగి సాధారణ కార్యకలాపాలు ఊపందుకుంటాయని వలస కూలీలు ఆశిస్తున్నారు. జూన్ 1 నుంచి ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలకు, ఫ్యాక్టరీలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.