రంగారెడ్డి, జూన్ 2, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు అని, రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన మంత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా జిల్లా అంతటా ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాండంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, జిల్లాలోని జడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రగతిభవన్లో జరిగిన వేడుకల్లో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నాంపల్లిలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, మల్లేశం, దయానంద్, జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతిరావు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల కల సాకారమై నేటికి ఏడేండ్లు
తెలంగాణ ప్రజల కల సాకారమై నేటికీ ఏడేండ్లు పూర్తయ్యిందని మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనతికాలంలోనే కనీవిని ఎరుగని అభివృద్ధిని సాధించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు నేడు కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు అమలుచేస్తున్నాయని.. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు లభించిన గౌరవమన్నారు. తెలంగాణ వస్తే చీకట్లే అన్న మాటల నుంచి నేడు 24 గంటల విద్యుత్తు సరఫరాతో చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతున్నదన్నారు. దేశ స్వాతంత్య్రం అనంతరం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనన్నారు. ప్రతి ఎకరాకు సాగు నీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై దృష్టి సారించి, పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో జిల్లాకు సాగునీటి కల నెరవేరుతుందన్నారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 99,035 ఎకరాల్లో వరి సాగవగా 2.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. జిల్లావ్యాప్తంగా 26 కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు. అంతేకాకుండా వ్యవసాయోత్పత్తులను నిల్వ ఉంచేందుకు వీలుగా 70,900 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల 29 గోదాములను ఏర్పాటు చేశారన్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధ సంఘాలకు ప్రాధాన్యతనిస్తూ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో 384 గ్రామాల్లో గొర్రె కాపరుల సంఘాలను ఏర్పాటు చేసి 21,094 సంఘాలకు రూ.143.11 కోట్ల విలువైన 11,449 యూనిట్లను పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో జిల్లాలో అనేక పనులు చేపట్టామని.. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని 558 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లతోపాటు ట్రాలీ, ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.
కరోనా కట్టడికి చర్యలు
కరోనా కట్టడికి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొవిడ్ కేర్, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కొండాపూర్లోని జిల్లా ఆసుపత్రితోపాటు వనస్థలిపురం ఏరియా దవాఖానల్లోనూ కొవిడ్ చికిత్సకు పడకలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారన్నారు. జిల్లాలోని అన్ని దవాఖానల్లో ఆక్సిజన్తోపాటు మందులు, ఇంజక్షన్ల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఇంటింటి జ్వర సర్వేతో స్వల్ప లక్షణాలు ఉన్నవారికి మందులు అందించడంతో కరోనా వ్యాప్తిని చాలా వరకు నియంత్రించగలిగామన్నారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు.. ఇప్పటివరకు 4.78 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వటం పూర్తయిందన్నారు. సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సినేషన్ ప్రక్రియ గ్రామీణ ప్రాంతంలో పూర్తికాగా, అర్బన్ ప్రాంతంలో కొనసాగుతున్నదన్నారు. జూన్ 9 వరకు లాక్డౌన్ను పొడిగించిన దృష్ట్యా ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. నాలుగేండ్లలో జిల్లాలో 62,342 మంది గర్భిణులకు నూ.18.68కోట్ల ఆర్థిక సహాయంతోపాటు కేసీఆర్ కిట్స్ను అందించారన్నారు. జిల్లాలోని 16,618 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.588 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలో ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు ప్రతి నెల రూ.35 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నదన్నారు.
పారిశ్రామిక రంగానికి అధిక పెట్టుబడులు
రాష్ర్టావిర్భావం అనంతరం జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా జిల్లాకు రూ.20,928 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, టీఎస్-ఐపాస్ విధానం అమల్లోకి వచ్చిన అనంతరం రూ.18,023 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. జిల్లావ్యాప్తంగా గత ఏడేండ్లలో 2247 సూక్ష్మ తరహా, 1157 చిన్నతరహా పరిశ్రమలు, 102 పెద్ద తరహా పరిశ్రమలు, 63 మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పారన్నారు. మరోవైపు మెగా ఉత్పత్తి పరిశ్రమలు జిల్లావ్యాప్తంగా 10 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3768 కోట్ల పెట్టుబడులు రాగా, మెగా ఇన్ఫ్రా(ఐటీ టవర్స్) ప్రాజెక్టులు జిల్లాలో 33 ఏర్పాటుకాగా రూ.9765 కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకంలో భాగంగా గతేడాది వానకాలం సీజన్లో 3,09,945 మంది రైతులకు రూ.344 కోట్ల రైతుబంధు సాయాన్ని వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం జమ చేసిందన్నారు. రైతుబీమాలో భాగంగా గతేడాది 804 మంది రైతులు మరణించగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.40.20 కోట్లను అందజేశారన్నారు. జిల్లా ప్రజలకు తాగునీరందించేందుకు రూ.1396 కోట్లతో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి 1062 ఆవాసాలకు, ఎనిమిది మున్సిపాలిటీలకు తాగునీరందిస్తున్నామన్నారు. అంతేకాకుండా జిల్లాకు 6777 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, 6383 ఇండ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, 309 ఇండ్లు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం 2221 ఇండ్లు పూర్తయినట్లు, మిగతా ఇండ్లలో మరో 2757 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభంకాగా వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.