న్యూఢిల్లీ : భారీగా రద్దీ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్, మే మధ్య అదనపు రైళ్లు నడిపేందుకు రైల్వే సిద్ధమైంది. గోరఖ్పూర్, పాట్నా, ముజఫర్పూర్, వారణాసి, గౌహతి, ప్రయాగ్రాజ్, లక్నో, బరౌని, కోల్కతా, దర్భంగా, భాగల్పూర్, మాండూవాడి, రాంచీ తదితర ప్రాంతాలకు 330 అదనపు రైళ్లు, 674 ట్రిప్పులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే బోర్డ్ చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. ఇందులో 101 ముంబై నుంచి, 21 రైళ్లు ఢిల్లీ ప్రాంతం నుంచి నడువనున్నాయి. దేశంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నా అదనంగా రద్దీ లేకున్నా.. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రయాణికుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.
ఈ మేరకు రైల్వేశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 70శాతం రైల్వే సేవలు కొనసాగుతున్నాయని, డిమాండ్ ఉన్న చోట అదనపు రైల్వే నడుపుతున్నట్లు బోర్డు చైర్మన్ సునీత్ శర్మ పేర్కొన్నారు. ప్రతి రోజు సగటున 1,514 ప్రత్యేక రైళ్లు.. 5,387 సబర్బన్ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అదనంగా రద్దీతో కూడిన 28 ప్రత్యేక రైళ్లకు క్లోన్ రైళ్లు, 984 ప్యాసింజర్ రైలు సర్వీసులు నడుస్తున్నాయని వివరించారు. కొవిడ్ కేసుల పెరుగుదల మధ్య సర్వీసులు నిరంతరం నడుస్తున్నాయని, డిమాండ్ ఉన్న చోట సర్వీసులు పెంచుతామని స్పష్టం చేశారు.