భీమ్గల్, ఏప్రిల్ 21: భీమ్గల్ను సకల సౌకర్యాలతో సుందర పట్టణంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, కమిషనర్ గోపు గంగాధర్, ఏఈ రఘుతో సమావేశమయ్యారు. పట్టణంలో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భీమ్గల్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహకారంతో పట్టణాన్ని అన్ని సౌకర్యలతో అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించుకున్నామని తెలిపారు. భీమ్గల్ పట్టణం రానున్న రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఆదర్శంగా మారనుందని అన్నారు. సమీప గ్రామీణ ప్రాంతాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పట్టణానికి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగే ఆస్కారం ఉన్నదని అన్నారు. ప్రజా, వాణిజ్య రవాణా పెరగనుందన్నారు. రద్దీ దృష్ట్యా పట్టణ ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని బీటీ, సీసీ రోడ్లు, సమీకృత మార్కెట్, కల్యాణ మండపం, వైకుంఠ ధామాలు, ఓపెన్ జిమ్, అర్బన్ పార్కులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పేదల కోసం చేపట్టనున్న కల్యాణ మండపాన్ని అన్ని హంగులతో, అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించాలని అధికారులకు మంత్రి సూచించారు.
సుందరీకరణకు పెద్దపీట వేయాలి
పట్టణ సుందరీకరణకు పెద్దపీట వేయాలన్నారు. ఇందులో భాగంగా మొక్కలను విరివిగా నాటి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. పట్ణణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రముఖ పట్టణాల్లోని అర్బన్ పార్కులను పరిశీలించి, ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు, పెద్దలకు సౌకర్యవంతమైన వాకింగ్ ట్రాక్స్, లాన్, వెయిటింగ్ హాల్, ఫుడ్ కోర్టులు ఉండే విధంగా చూడాలన్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ అన్ని వసతులతో ఏర్పాటు చేయాలన్నారు. వెజ్ ఒకవైపు, నాన్వెజ్ ఒకవైపు, పండ్ల స్టాళ్లు మరోవైపు ఉండేలా నిర్మాణాలను చేపట్టాలని అన్నారు. పట్టణంలో వైకుంఠధామాల నిర్మాణాలను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వైకుంఠధామాల్లో మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు స్నానాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ హరితహారంలో భాగంగా పెద్దసంఖ్యలో మొక్కలు పెంచాలన్నారు. దాదాపు రూ. 15 కోట్ల నిధులతో ఇప్పటికే కొనసాగుతున్న పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. పనుల పురోగతిని తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని చెప్పారు. అర్బన్ పార్కు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, కల్యాణ మండపం, వైకుంఠధామాల నిర్మాణ డిజైన్లను పరిశీలించి అధికారులకు మంత్రి పలుసూచనలు చేశారు.