హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాతో సతమవుతూ దవాఖానల్లో, హోం ఐసోలేషన్లో ఉన్నవారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల కరుణామృత ధారలు కురిపిస్తున్నారు. రోజూ 2 వేల మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. తన తండ్రి బిగాల కృష్ణమూర్తి గుప్త స్మృత్యర్థం సొంత ఖర్చులతో మూడునాలుగు కూరలతోపాటు బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, ప్లేట్, స్పూన్, శానిటైజర్, మాస్కులు ప్యాక్చేసి కరోనా బాధితులకు, హోం ఐసోలేషన్లో ఉన్న వారికి పంపిణీ చేస్తున్నారు. ఎనిమిది ఆటో ట్రాలీల ద్వారా వీటిని చేరవేస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇది తనకెంతో సంతృప్తినిస్తున్నదని మహేశ్ బిగాల తెలిపారు. గతేడాది కూడా ఆయన 41 రోజుల పాటు నిత్యం 1,500 మంది ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇదేవిధంగా ఆపన్న హస్తం అందించిన విషయం తెలిసిందే.