న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం భారీగా వర్షం కురిసింది. 46 ఏండ్ల గరిష్ఠ స్థాయిలో 1,100 మిల్లీమీటర్ల మేర పడిన వానలకు ఎయిర్పోర్ట్తోసహా ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కొందరు పిల్లలు వర్షం నీటితో నిండిన రోడ్లపై ఈత కొట్టారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పౌర కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉచిత స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించారని, వచ్చే ఒలింపిక్స్ కోసం కొందరు ఈత ప్రాక్టీస్ చేస్తున్నారని నెటిజన్లు విమర్శించారు. మరోవైపు ఢిల్లీలో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.