హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండోరోజు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. ప్రతి గ్రామం, పట్టణాల్లోని డివిజన్లు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ ప్రగతిలో భాగంగా 61,475 మొక్కలు నాటగా, రెండురోజుల్లో కలిపి 1.05 లక్షలు నాటారు. రోడ్డుమధ్యలో 1,891 మీటర్ల పరిధిలో మొక్కలు పెట్టారు. 4 వేల కిలోమీటర్ల పరిధిలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఒక్కో కుటుంబానికి ఆరు చొప్పున 1.23 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2,577 కిలోమీటర్ల మేర మొక్కలు నాటారు. 1,014 దళిత బస్తీల్లో అధికారులు పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారు. 1,967 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరిచేశారు. 215 వంగిన, తుప్పు పట్టిన విద్యుత్తు స్తంభాలను మార్చారు. 2,600 టన్నుల చెత్తను ఎత్తిపోశారు. 1,150 టన్నుల శిథిలాలను తొలగించారు. 1,448 కిలోమీటర్ల మురుగు కాలువలను శుభ్రపరిచారు. 1,060 ప్రాంతాల్లో దోమల వ్యాపించకుండా ఫాగింగ్ చేశారు. 174 పార్కులను, 689 ప్రభుత్వ సంస్థలు, దేవాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ముందు శుభ్రంచేశారు.