న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో ఎగురుతున్న డ్రోన్ను ఢిల్లీ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజయ్ ఘాట్ మీదుగా ఎగిరిన డ్రోన్ కలకలం రేపింది. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటింగ్కు పోలీసులు అనుమతి ఇవ్వగా డ్రోన్ ఎగిరేందుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. నిబంధనలు ఉల్లంఘించిన వెబ్ సిరీస్ రూపకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వారం ఆరంభంలో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం.
ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. ఆగస్ట్ 15 వేడుకల నేపథ్యంలో ఢిల్లీతో పాటు ముఖ్యంగా ఎర్రకోట ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్ధలు డ్రోన్లను ఉపయోగించి దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ఎర్రకోట ప్రాంతంలో డ్రోన్ కదలికలు ఆందోళన రేకెత్తించాయి.