న్యూఢిల్లీ: పార్లమెంట్ వద్ద రైతుల నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ వద్ద నిరసనపై పునరాలోచించుకోవాలని రైతు నేతలకు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్ వద్ద నిరసన చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల ప్రకటించింది. ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు చొప్పున 40 రైతు సంఘాల తరుఫున సుమారు 200 మంది రైతులు ప్రతి రోజు పార్లమెంట్ వద్ద నిరసనలో పాల్గొంటారని తెలిపింది.
ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధుల బృందం ఆదివారం ఢిల్లీ పోలీసులను కలిసింది. పార్లమెంట్ సమీపంలో శాంతియుత నిరసనకు అనుమతి కోరింది. నిరసనలో పాల్గొనే రైతులకు పాసులు, గుర్తింపు కార్డులు ఇస్తామని రైతు ప్రతినిధులు పోలీసులకు చెప్పారు. అయితే పార్లమెంట్ వద్ద నిరసనపై పునరాలోచించుకోవాలని రైతులను కోరిన ఢిల్లీ పోలీసులు దీనికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.