న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు మాస్కే ఆయుధమని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కోడై కూస్తున్న జనాలకు మాత్రం పట్టడం లేదు. విన్నట్టే విని పెడ చెవిన పెడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రో అధికారులు మాస్కు ధరించడంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
మెట్రో రైళ్లలో అధికారులు పర్యటిస్తూ.. మాస్కు సరిగా ధరించని ప్రయాణికులకు జరిమానా విధిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 672 మంది ప్రయాణికులకు అధికారులు జరిమానా విధించారు. ఫేస్ మాస్కు సరిగా ధరించాలి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మనం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఇతరులను కూడా సరైన మార్గంలో పెట్టాలని ప్రయాణికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,506 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మంది చనిపోయారు. 3,363 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,90,568కి చేరగా, మరణాల సంఖ్య 11,133కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,455.