కొత్తూరు, మే 3 : ‘ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే… సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గులాబీ పార్టీకి తిరుగులేదు..’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం కొత్తూరు మున్సిపల్ విజయోత్సవం సందర్భంగా రాధా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను టీఆర్ఎస్ 7 వార్డులను గెలుచుకుందన్నారు. కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురడం శుభపరిణామమన్నారు. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గెలుపోటములు సహజమని, అందురూ సమన్వయంతో పని చేసి అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకెళ్లాలని, తనవంతు సహకారం అందిస్తానన్నారు. గెలిచిన అభ్యర్థులు మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కొత్తూరు ప్రాంతంలో చాలా మంది యువత టీఆర్ఎస్లో చేరారన్నారు. అధికారంలో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ ఏ విధంగానైనా ప్రజలకు సేవచేసే అవకాశం లభిస్తుందన్నారు. ఎక్కడెక్కడ టీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేదో అక్కడ కో ఆప్షన్ సభ్యులు ఉండేలా చూద్దామన్నారు. 4 కో ఆప్షన్ సభ్యులను నియమించే అవకాశం మున్సిపల్ చట్టంలో ఉందన్నారు. ఓడిన వార్డులపై తర్వాత సమీక్షించుకుందామని తెలిపారు. తిమ్మాపూర్లోని మూడు వార్డులను గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొత్తూరులో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కావాలని సూచించారు.
అభివృద్ధే గెలిపించింది : ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధే కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. 7 వార్డుల విజయంలో ప్రతి కార్యకర్త కృషి ఉందని, ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని వార్డుల్లో ఓడిపోయామని, పొరపాట్లను సరి చేసుకుందామన్నారు. ఎన్నికల్లో నిరంతరం మన వెంట ఉండి నడిపించిన మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, సుదర్శన్గౌడ్, జనార్దనచారి, రాజేందర్గౌడ్, గెలిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.