సైబర్ నేరగాళ్లకు అడ్డాగా జార్ఖండ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు ఉండగా.. తాజాగా బిహార్లోని కొన్ని జిల్లాలు కూడా ఆ జాబితాలో చేరిపోయాయి. జార్ఖండ్లోని జామ్తారా, దేవఘర్, రాంచీ , రాజస్థాన్లోని భరత్పూర్తో పాటు బిహార్లోని నలంద, గయా, బిహార్షరీఫ్, షేక్పురా జిల్లాల్లో సైబర్నేరగాళ్లు పాతుకుపోయారు. స్థానికంగా ఎలాంటి నేరాలు చేయకుండా.. ఇతర ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. అయితే.. దేశ వ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారికి అంతంత మాత్రం చదవులే.. 10వ తరగతి కూడా పాసై లేరు. అయినా.. సైబర్నేరాల్లో ఆరితేరి దోచుకుంటున్నారు. ముఖ్యంగా కేవైసీ అప్డేట్ చేయాలని, కార్డు బ్లాక్ అవుతుందని, ఓఎల్ఎక్స్, ఫేస్బుక్, క్వికర్, క్యూఆర్ కోడ్, కస్టమర్ కేర్, లాటరీలకు సంబంధించి మోసాలకు పాల్పడుతున్నారు.
జార్ఖండ్, రాజస్థాన్, బిహార్ రాష్ర్టాలకు చెందిన సైబర్ నేరగాళ్లు ఇతర రాష్ర్టాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. జార్ఖండ్ సైబర్ నేరగాళ్లపై అక్కడి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పట్టుబడిన వారికి ఆరు నెలల వరకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడి సైబర్నేరగాళ్లు స్థానికంగా కేసులు కాకుండా చూసుకుంటున్నారు. స్థానికంగా నేరాలు చేయకపోతే స్థానిక పోలీసులు తమపై దృష్టి సారించరనే భావన ఆయా ముఠాలపై ఉంది. దీంతో స్వరాష్ర్టానికి చెందిన వారిని మోసం చేయకుండా.. పక్క రాష్ట్రాల వారిని మోసం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో అయితే తమను ఎవరూ పట్టుకోరనే ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు. జార్ఖండ్, రాజస్థాన్కు చెందిన సైబర్నేరగాళ్లు ఎక్కువగా కొన్ని నేరాల్లో ఆరితేరి ఉండగా.. బిహార్కు చెందిన సైబర్నేరగాళ్లు మాత్రం అన్ని రకాలైన నేరాలు చేస్తున్నారు. వ్యాపారాలు, స్టాక్మార్కెట్లను అడ్డం పెట్టుకుని వ్యాపారుల వద్ద నుంచి లక్షలు కాజేస్తున్నారు. ఇటీవల బిహార్కు చెందిన ఇద్దరు సైబర్నేరగాళ్లను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు ఇన్వెస్ట్మెంట్తో పాటు, గుర్రం పం దాల్లో పెట్టుబడులు పెడుతామంటూ రూ. 20 లక్షల వరకు టోకరా వేశాడు.. మరొకడు హల్దీరామ్ డిస్ట్రిబూషన్ షిప్ ఇప్పిస్తానంటూ రూ. 20 లక్షల వరకు మోసం చేశాడు.
రాజస్థాన్లోని భరత్పూర్..
రాజస్థాన్లోని భరత్పూర్ పరిసర ప్రాంతాల్లోని నేరగాళ్లు.. ఓఎల్ఎక్స్, ఫేస్బుక్, క్వికర్, క్యూఆర్ కోడ్, కస్టమర్ కేర్, లాటరీలకు సంబంధించిన తదితర నేరాలు చేయడంలో ఆరితేరారు. ఎక్కువగా ఆర్మీ పేరును వాడుకుంటూ మోసాలు చేస్తుంటారు. ఈ గ్యాంగ్లకు స్థానిక పోలీసులు, అక్కడుండే రాజకీయ నాయకుల సహకారం ఉంటుంది. అక్కడ మూడు రాష్ర్టాల సరిహద్దు ప్రాంతం ఉండటంతో నేరగాళ్లకు కలిసి వస్తోంది. అక్కడి నేరగాళ్లను పట్టుకోవడం కోసం వెళ్లే ఇతర రాష్ర్టాల పోలీసులపై ఆ ముఠాలు దాడులకు సైతం పాల్పడుతున్నాయి.
బిహార్ ముఠాలు..
బిహార్కు చెందిన సైబర్ నేరగాళ్లు.. భరత్పూర్, జామ్తారాలు చేసే నేరాలతో పాటు వ్యాపారులను మోసం చేయడం, లాటరీ వచ్చిందని, ఆన్లైన్ కోనుగోళ్లు చేసేవారి డాటాను సేకరించి.. బురిడీ కొట్టిస్తున్నారు.
జామ్తారా సైబర్నేరగాళ్లు …
జామ్తారా సైబర్నేరగాళ్లు ఎక్కువగా బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతుంటారు. ఇందులో కేవైసీ అప్డేట్, కార్డు బ్లాక్ అవుతుందని, కార్డు అప్గ్రేడ్ చేయాలనే కారణాలు చూపుతూ ఫోన్లు చేసి అమాయకులను మోసం చేస్తుంటారు. అందుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా అక్కడే సమకూర్చుకుంటారు. అక్కడి గ్యాంగ్లు సైబర్నేరాల్లో ఆరితేరారు. నేరగాళ్లను పక్క రాష్ట్రం పోలీసులు పట్టుకోవడానికి వెళ్తే.. వెంటనే ఆ గ్యాంగ్లకు సమాచారం చేరిపోతుంది. ఈ నేరగాళ్లను పట్టుకోవడం కోసం హైదరాబాద్ పోలీసులు అక్కడకు వెళ్లి.. అష్టకష్టాలు పడుతుంటారు. స్థానిక పోలీసుల నుంచి అంతగా సహకారం అందదు.
అప్రమత్తంగా ఉండాలి..
ఉన్నత చదువులు చదివినవారు, అన్ని విషయాలపై పరిజ్ఞానం ఉన్న వారిని సైతం సైబర్నేరగాళ్లు అప్పడప్పుడు బోల్తా కొట్టిస్తున్నారు. బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ సైబర్నేరగాళ్లు మాట్లాడే భాషను వెంటనే గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఫోన్లు చేసినప్పుడు ఆ విషయంపై కొద్దిగా దృష్టి పెట్టితే.. ఆ నేరానికి అక్కడే అడ్డుకట్ట వేయవచ్చు. కానీ అలాచేయకుండా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామనగానే కొందరు నమ్మేస్తున్నారు. ఇందుకు ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ను ఈ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఏదైనా తక్కువ ధరకు వస్తుందని, లాటరీ వచ్చిందని, ఏజెన్సీలు ఇప్పిస్తామని, పెట్టుబడులు పెట్టండంటూ ఫోన్ చేస్తే వాటిని నమ్మొద్దు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సైబర్క్రైమ్స్ ఏసీపీ