న్యూఢిల్లీ : మరో రెండు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందన్న ఆందోళనల నడుమ దేశ రాజధానిలో మరోసారి టీకాలకు కొరత ఏర్పడిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. టీకాల కొరత వెంటాడటంతో వ్యాక్సినేషన్ కేంద్రాలను పదేపదే మూసివేయాల్సి వస్తోందని జైన్ చెప్పారు. వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో లేవని, సోమవారం తమకు సరఫరా చేసిన 1.5 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బుధవారం వరకూ వాడేందుకు సరిపోతాయని ఆపై వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సినేషన్ కేంద్రాలను పలుమార్లు మూసివేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒకటి రెండు రోజులకు సరిపడా వ్యాక్సిన్లను పంపుతుంటే మిగిలిన రోజుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నామని ఢిల్లీ అధికారులు వెల్లడించారు. ఇక టీకాల ప్రక్రియ ప్రారంభమై నెలలు గడుస్తున్నా మన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా ఎందుకు ముందుకు సాగడంలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.