న్యూఢిల్లీ: ఆరు అమరవీరుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దేశానికి సేవ చేస్తూ అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా ఉంటున్నదని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన వెంటనే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, పోలీసు సిబ్బంది కుటుంబాలకు కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారని గుర్తు చేశారు. ప్రియమైన వ్యక్తి అమరవీరుడైనప్పుడు ఒక కుటుంబం అనుభవించే బాధ తీర్చలేనిదన్నారు. అయితే ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు సహాయపడుతుందని సిసోడియా అన్నారు. విధి నిర్వహణలో అమరులైన ఢిల్లీ పోలీస్కు చెందిన ఏసీపీ సంకేత్ కౌశిక్, కానిస్టేబుల్ వికాస్ కుమార్, భారత వైమానిక దళానికి చెందిన ఎన్సీ (ఈ) రాజేష్ కుమార్, ఫ్లైట్ లెఫ్టినెంట్ సునీత్ మొహంతి, స్క్వాడ్రన్ లీడర్ మీట్ కుమార్తోపాటు సివిల్ డిఫెన్స్కు చెందిన ప్రవీష్ కుమార్ కుటుంబాలకు ఈ మేరకు ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు.