న్యూఢిల్లీ : కరోనా వైరస్ అదుపులోకి రావడంతో దేశ రాజధానిలో స్కూళ్లను పునఃప్రారంభించే ముందు ఢిల్లీ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లితండ్రుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం వెల్లడించారు. టీచర్లు, తల్లితండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
స్కూల్స్ను తిరిగి తెరవాలని టీచర్లు, తల్లితండ్రులు కోరుకుంటున్నా మహమ్మారి నేపథ్యంలో వారిని భయం వెంటాడుతోందని అన్నారు. ఈ అంశంపై తాము టీచర్లు, విద్యార్ధులు, తల్లితండ్రుల అభిప్రాయం తెలుసుకుని ఎప్పటినుంచి స్కూళ్లను ఎలా తెరవాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లను తెరిచారని గుర్తుచేశారు. స్కూల్స్ రీఓపెన్ ప్రక్రియ ఎలా చేపట్టాలనే దానిపై విద్యార్ధులు, టీచర్లు, తల్లితండ్రులు తమ సలహాలను అందించాలని ఆయన కోరారు.