న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన సింగపూర్ స్ట్రెయిన్ వ్యాఖ్యలు రాజకీయంగా పెను ప్రకంపనలు రేపాయి. సింగపూర్ స్ట్రెయిన్ తో థర్డ్ వేవ్ భారత్ లో చిన్నారులపై ప్రభావం చూపుతుందని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను సింగపూర్ ఆక్షేపించడంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొవిడ్ వేరియంట్స్ పై మాట్లాడే సాధికారత కేజ్రీవాల్ కు లేదని పేర్కొంది. కేంద్రం తీరుపై ఆప్ విరుచుకుపడింది. మన చిన్నారుల భద్రత కంటే సింగపూర్ అంటేనే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు.
భారత్ లో థర్డ్ వేవ్ తో చిన్నారులకు వాటిల్లే నష్టంపై ఢిల్లీ ప్రభుత్వం కలత చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం సింగపూర్ తో సంబంధాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించారు. చిన్నారులకు వ్యాక్సిన్ తీసుకురాలేని కేంద్ర ప్రభుత్వం సింగపూర్ గురించి మాత్రం కలత చెందుతోందని ఆయన ఎద్దేవా చేశారు.