తాండూరు, మే 10 : కరోనా బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. కష్ట కాలంలో వారికి సత్వరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. తాండూరు సర్కార్ దవాఖానలో (రాజీవ్ కాలనీ సమీపంలోని మాతాశిశు దవాఖానలో) మహిళలకు, పురుషులకు, చిన్నారులకు వేర్వేరుగా ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో 75 ఆక్సిజన్ బెడ్లు, 15 ఐసీయూ బెడ్లతో పాటు 18 మంది వైద్యులు, 19 మంది నర్సులతో మూడు షిఫ్ట్లలో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నారు. ఐసొలేషన్ సెంటర్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలతో పాటు అత్యవసర పరిస్థితిలో అందజేసే రెమిడెసివిర్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, ఇతర మందులను అందుబాటులో ఉంచారు.
దవాఖానలో ఓపీ సేవలను కూడా ప్రారంభించారు. బాధితులు హైదరాబాద్కు పోకుండా స్థానికంగానే సేవలు అందించాలని, ప్రైవేటులో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సబితారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ పౌసుమి బసు, ఆర్డీవో అశోక్కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో దవాఖానలో బెడ్లు, రెండు అంబులెన్స్లతో పాటు సకల సౌకర్యాలు కల్పించారు. మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో 100 బెడ్లు అందజేశారు. కలెక్టర్ పౌసుమి బసు ప్రజలకు సేవా చేయాలనే తపనతో వ్యక్తిగత చొరవతో రూ.2 కోట్లతో ప్రత్యేక సీటీ స్కాన్ పరికరాన్ని త్వరలో తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అవుట్ పేషెంట్ సేవలు..
హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. జిల్లా కేంద్ర దవాఖానతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఔట్ పేషెంట్ సేవలు చేస్తున్నారు. గర్భిణీ, బాలింతలకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సాధారణ రోగులకు ఇబ్బందులు కలుగకుండా తాండూరు పట్టణంలోని జిల్లా దవాఖానలోని ఐసొలేషన్ సెంటర్ను హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతాశిశు దవాఖానలోకి మార్చినట్లు అధికారులు, వైద్యులు తెలిపారు. జిల్లాలో కొవిడ్ హెల్ఫ్ లైన్ కోసం 18005996863 ఫోన్ ఏర్పాటు చేశారు.
అనంతగిరి టీబీ శ్యానిటోరియంలో..
వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరి టీబీ శానిటోరియంలో 40 బెడ్లతో కూడిన ప్రత్యేక ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. 20 బెడ్లు మహిళలకు, 20 బెడ్లు పురుషులకు కేటాయించారు. కరోనా పాజిటివ్ వచ్చినవారికి, ఇండ్లల్లో స్థలం లేనివారు ఉండేందుకు వెసులు బాటు కల్పించారు. ఇక్కడ ఉన్న కరోనా బాధితులకు మాత్రలు, ఆహారం అందజేస్తున్నట్లు ఐసొలేషన్ ఇన్చార్జి తెలిపారు.