ఢిల్లీ : దేశ రాజధానిలో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసుల దృష్ట్యా షకుర్ బస్తీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లలో 5 వేల పడకల సామర్థ్యంతో కొవిడ్-కేర్ కోచ్లను మోహరించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం రైల్వేను కోరింది. ఢిల్లీలో ఇప్పటికే 25 వేల కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయని గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు దాదాపు 30 శాతానికి పెరిగిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గణాంకాలను వెల్లడించారు.
ఢిల్లీ ఆస్పత్రుల్లో 100 కన్నా తక్కువ ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని, పరిస్థితి ప్రతి క్షణం మరింత దిగజారిపోతోందని ఆయన అన్నారు. కరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ సీఎస్ విజయ్ కుమార్ దేవ్ రైల్వే బోర్డు చైర్మన్ సునీత్శర్మకు లేఖ రాశారు.
ఆస్పత్రుల్లో చికిత్స అవసరమయ్యే తీవ్రమైన కేసులు అధికంగా ఉన్నాయని కావునా పెరుగుతున్న డిమాండ్ను అనుసరించి ఎక్కువ సంఖ్యలో కొవిడ్ బెడ్ సౌకర్యాలు అవసరమన్నారు. అందువల్ల ఆనంద్ విహార్, షకుర్ బస్తీ రైల్వే స్టేషన్లలో పూర్తి లాజిస్టికల్ సపోర్ట్, అవసరమైన వైద్య, పారామెడికల్ సిబ్బంది, ఆక్సిజన్ సౌకర్యాలు మొదలైన వాటితో కొవిడ్ బెడ్ సౌకర్యాలను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు సీఎస్ దేవ్ లేఖలో పేర్కొన్నారు.