Covid Spike in Delhi | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతో దవాఖానల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఫేస్మాస్క్లు ధరించాలని, కొవిడ్-19 ముందు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను అధికారులు కోరారు. ఢిల్లీలో కొవిడ్ మహమ్మారి తీవ్రతపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్కుమార్ సక్సేనా స్పందించారు. `కొవిడ్ కేసులు పెరగడం మనం గమనిస్తున్నాం. రీ ఇన్ఫెక్షన్తో అత్యధిక పాజిటివిటీ రేటు నిత్యం కొనసాగుతున్నది. మహమ్మారి ఎఫెక్ట్ పోయిందని భావిస్తున్న మనమంతా వాస్తవిక పరిస్థితుల గురించి రియలైజ్ కావడం తప్పనిసరి. కొవిడ్ మార్గదర్శకాలు పాటించడం మరిచిపోవద్దు` అని ట్వీట్ చేశారు. ప్రతి రోజూ సగటున ఎనిమిది మంది నుంచి 10 మంది మరణిస్తున్నారు. సోమవారం 1227 కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా, పాజిటివిటీ రేటు 14.57 శాతానికి చేరింది. ఎనిమిది మంది రోగులు మృత్యువాత పడ్డారు.
గత 12 రోజులుగా 200కి పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 2,162 మంది కొవిడ్ బారిన పడగా, ఐదుగురు మరణించారు. శనివారం తొమ్మిది మంది మృతి చెందితే, కొత్తగా 2031 మందికి కొవిడ్ సోకింది. శుక్రవారం అత్యధికంగా 10 మంది మరణించగా, కొత్తగా 2,136 మంది కరోనా బారిన పడ్డారు. పాజిటివిటీ రేటు 15.02 శాతంగా నమోదైంది. ఆరు నెలల తర్వాత పది మంది కొవిడ్తో మృతి చెందడం ఇదే తొలిసారి. గత ఫిబ్రవరి 13న 12 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు.
`రికవరీ రేటు బాగానే ఉన్నా, కొవిడ్ పాజిటివ్ కేసులు, దవాఖానల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్నది. 9000 మందిలో 500 మందికి పైగా బెడ్లకు పరిమితం అవుతున్నారు. 2129 మందిలో 20 మందికి పైగా ఐసీయూలో చేరుతున్నారు. 65 మంది పేషంట్లు వెంటిలెటర్లపై జీవిస్తున్నారు అని లాన్సెట్ కమిషన్ సభ్యురాలు, ఢిల్లీ పబ్లిక్ హెల్త్ నిపుణురాలు డాక్టర్ సునీలా గార్గ్ తెలిపారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఆచితూచి స్పందించాల్సి ఉందని హెచ్చరించారు.