న్యూఢిల్లీ, మే 26: ప్రాణాలను కాపాడటానికి, కరోనా మహమ్మారిని ఓడించటానికి టీకాలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. కరోనా సంక్షోభం చాలామంది జీవితాల్లో విషాదాన్ని నింపిందని, బాధలను తెచ్చిందని, ఆర్థికంగా పెను ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా వేసక్ దినోత్సవంలో ఆయన వర్చవల్గా ప్రసంగించారు. కరోనా ప్రతి దేశాన్నీ దెబ్బతీసిందని అన్నారు. ఇదే సమయంలో మన పోరాట వ్యూహాన్ని పటిష్ఠం చేసే పలు పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయన్నారు. కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన తమ శాస్త్రవేత్తలను చూసి భారతదేశం గర్విస్తున్నదన్నారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్, శ్రీలంక ప్రధానమంత్రులతో పాటు అంతర్జాతీయ బౌద్ధుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.