న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం లేకుంటే సెకండ్ వేవ్ వ్యాప్తి ఈ స్థాయిలో ఉండేది కాదని అన్నారు. భారత్ పై పాకిస్తాన్ దాడికి దిగితే యూపీ, ఢిల్లీ సొంతంగా తమ ఆయుధాలు, యుద్ద ట్యాంకులు కొనుగోలు చేయాలా అని ప్రశ్నించారు.
వ్యాక్సిన్లు సమీకరించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రయత్నించినా ఇప్పటి వరకూ వ్యాక్సిన్లను ఏ ఒక్కరూ ఏర్పాటు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్లను విక్రయించేందుకు విదేశీ వ్యాక్సిన్ కంపెనీలు నిరాకరించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా సఫలం కాలేదని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసిందని దుయ్యబట్టారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుగానే చేపడితే మనం ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగేవారమని వ్యాఖ్యానించారు. కొవిడ్-19 పోరాటంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా టీమిండియాలా వ్యవహరించాలని అన్నారు. కేంద్రమే వ్యాక్సిన్లను సమీకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ విషయంలో ఇంకా జాప్యం జరిగితే ఎంత మంది ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందో అంచనా వేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు.