రాష్ట్రవ్యాప్తంగా 1300 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
మంత్రి ఈటల రాజేందర్
కమలాపూర్ ఏప్రిల్ 19 : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. సోమవారం మండలంలోని ఉప్పలపల్లి, ఉప్పల్, కమలాపూర్, గూడూరు, అంబాల, శ్రీరాములపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని 1300 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరూ రెండు సార్లు టీకా వేసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో అవసరం మేరకే బయటకు రావాలన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నదన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. అనంతరం కమలాపూర్, గూడూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 149 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, సర్పంచ్లు బొల్లపెల్లి ఉమ, ఎర్రబెల్లి దేవేందర్రావు, కట్కూరి విజయారెడ్డి, కంచనకుంట్ల విజేందర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు మౌటం రమేశ్బాబు, హెడ్వర్డ్, వెంకట్రెడ్డి, ఐకేపీ ఏపీఎం నారాయణ, పీఏసీఎస్ కార్యనిర్వహణాధికారి చోటేమియా, ఉపసర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా కట్టడికి కార్యోన్ముఖులు కావాలి : మంత్రి ఎర్రబెల్లి
వెంకీ ‘దృశ్యం 2’ కు ఓటీటీలో మంచి డిమాండ్..!