న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ‘దేశ్ కే మెంటర్’ కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కెరీర్ ఎంపికపై వివిధ రంగాలలో విజయం సాధించిన వ్యక్తులు మార్గదర్శకత్వం వహిస్తారు. విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా రాణించేందుకు తమ విలువైన సూచనలు, సలహాలు అందిస్తారు.
చాలా మంది పిల్లలకు తమ ఆలోచనను బహిర్గతం చేసే సామర్థ్యం పరిమిత స్థాయిలో ఉంటుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. చదువులో మంచిగా ఉంటే, డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని అనుకుంటారని, తాను కూడా చిన్నప్పుడు అలాగే అనుకునే వాడినంటూ గుర్తు చేసుకున్నారు.
విద్యార్థులు తాము ఎంచుకునే రంగం గురించి మంచి మెంటర్లు పూర్తి అవగాహన కల్పించడంతోపాటు వారికి అన్ని విధాలా మార్గదర్శకత్వం వహిస్తారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. విద్యార్థులే స్వయంగా తమ కెరీర్కు గైడెన్స్ ఇచ్చే మెంటర్ను ఎంచుకోవచ్చని వివరించారు.