న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశంలోని ఇతర వ్యాక్సిన్ తయారీ కంపెనీలను రంగంలోకి దించాలని కేజ్రీవాల్ సూచించారు. దేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లు మాత్రమే కొవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయని, ఈ రెండూ కలిపి గరిష్టంగా 6-7 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను మాత్రమే ఉత్పత్తి చేయగలవని కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ పేర్కొన్నారు. ప్రస్తుత వేగంతో భారత్ లో ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ వేయాలంటే రెండేండ్ల సమయం పడుతుందని ఈలోగా పలు కొవిడ్ వేవ్ లు దేశాన్ని ముంచెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు పౌరులందరికీ వ్యాక్సినేషన్ చేపట్టేలా జాతీయ విధానానికి రూపకల్పన సాగించాలని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ఫార్ములాను ఆ రెండు కంపెనీల నుంచి సేకరించి వ్యాక్సిన్ ను సురక్షితంగా ఇతర దేశీ కంపెనీలు తయారు చేసేలా చట్టం రూపొందంచాలని కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఎస్ఐఐ, భారత్ బయోటెక్ లకు రాయల్టీ పొందే వెసులుబాటు కల్పించవచ్చని అన్నారు. ఇక ఢిల్లీలో ప్రస్తుతం రోజూ 1.25 లక్షల వ్యాక్సిన్ డోసులు అందిస్తున్నామని, త్వరలో రోజుకు మూడు లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ చేపడతామని చెప్పారు. ఢిల్లీని వ్యాక్సిన్ కొరత వేధిస్తోందని, వ్యాక్సిన్ సరఫరాలు దేశానికి అతిపెద్ద సవాల్ గా మారాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.