న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తర్వాత తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా కన్వర్ యాత్రను రద్దు చేసింది. ఈ ఏడాది కూడా కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) తెలిపింది. కరోనా థర్డ్ వేవ్కు దారితీస్తుందన్న భయాందోళన నేపథ్యంలో, ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న వార్షిక కన్వర్ యాత్రను కరోనా పరిస్థితుల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనిని తప్పక పాటించాలని ఢిల్లీలోని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సూచించింది.
కాగా, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన శివ భక్తులు కాలి నడకన లేదా వాహనాల్లో ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు వెళ్లి పవిత్ర గంగా నది నీటిని పాత్రల్లో సేకరిస్తారు. తమ ఊరికి తీసుకెళ్లి స్థానిక శివాలయాల్లో ఆ గంగా జలంతో అభిషేకాలు నిర్వహిస్తారు. అయితే కరోనా నేపథ్యంలో గత ఏడాది కన్వర్ యాత్రను రద్దు చేశారు. ఈ ఏడాది కూడా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తోపాటు ఢిల్లీ ప్రభుత్వాలు కన్వర్ యాత్రను రద్దు చేశాయి. బీహార్, జార్ఖండ్ రాష్టాల్లో కూడా దీనిని రద్దు చేసే అవకాశమున్నది.