కుత్బుల్లాపూర్,మే26: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మంజూరైన నిధులతో ముంపు సమస్య రాకుండా త్వరలో నాలాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో స్పందించి ఎస్ఎన్డీపీ నిధుల కింద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి నాలాల అభివృద్ధికి రూ.193.49 కోట్లు మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఫాక్స్ సాగర్ కాలువ నుంచి పైపులైన్ రోడ్డులోని కెమికల్ నాలా వరకు ఎంతో జఠిలమైన సమస్య అంగడిపేటలోని కోల్ కాలువ నుంచి వెన్నెలగడ్డ మీదుగా పైపులైన్ రోడ్డులోని కెమికల్ నాలా వరకు నాలా అభివృద్ధికి రూ. 95 కోట్లు నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు.
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని పాపయ్యకుంట నుంచి బాలాజీ టవర్స్ వరకు నాలా అభివృద్ధికి రూ.2.20 కోట్లు, ఆచార్య కుంట నుంచి బాటా జంక్షన్ వరకు రూ.3.66 కోట్లు, బాలాజీ కాలనీ నుంచి బాటా జంక్షన్ వరకు బాటా జంక్షన్ వరకు రూ.3.69 కోట్లు, బాటా జంక్షన్ నుంచి శ్రీ బాలాజీ టవర్స్ వరకు రూ.5.69 కోట్లు, బండారి లే అవుట్ నుంచి సాయి భాస్కర్ నెస్ట్ కాలనీ వరకు రూ.7.35 కోట్లు, కేజీఎం ఎన్క్లేవ్ నుంచి కోకాకోలా కంపెనీ వరకు రూ.53.57 కోట్లు, శ్రీకృష్ణ హిల్స్ నుంచి క్విన్ ఇండియా వరకు రూ.4.68 కోట్లు, భవ్యాస్ ఆనందం నుంచి లేక్ రిడ్జ్ అపార్ట్మెంట్ వరకు రూ.3.17 కోట్లు, మొండి కుంట నుంచి ఎస్ఆర్ఆర్ ప్రైడ్ అపార్ట్మెంట్ వరకు రూ.62 లక్షలు, దూలపల్లి నుంచి ఫాక్స్సాగర్ వరకు రూ.13.86 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలో పనులు మొదలు కానున్నట్లు వివరించారు.
ప్రజా సమస్యల పరిష్కారం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధికి బాటలు వేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపర్చే విధంగా బాటలు వేస్తున్నట్లు తెలిపారు. నిధుల విడుదలకు కృషి చేసిన మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కృతజ్ఞతలు తెలిపారు.