న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కోవిడ్ టీకాకు త్వరలో రెండవ, మూడవ దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్, గురునానక్ హాస్పిటల్, హర్యానాలోని ఇన్క్లెన్ హాస్పిటల్లో ఆ ట్రయల్స్ చేపట్టనున్నారు. రెండవ, మూడవ దశ ట్రయల్స్ మరో రెండు వారాల్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎథిక్స్ కమిటీ అనుమతి దక్కాకే ట్రయల్స్ ప్రారంభం అవుతాయి. రెండవ దశ పూర్తి అయ్యాకే.. మూడవ దశ ట్రయల్స్ను నిర్వహించనున్నారు.
ముక్కు ద్వారా వేసే టీకాకు చెందిన తొలిదశ క్లినికల్ ట్రయల్స్ జూన్లో ముగిశాయి. 18 నుంచి 60 ఏళ్ల మధ్య హెల్తీ వాలంటీర్లలో ఆ ట్రయల్స్ను భారత్ బయోటెక్ నిర్వహించింది. ఇన్ట్రానాసల్ వ్యాక్సిన్ను BBV154గా పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన మధ్యంతర డేటాను .. సీడీఎస్సీవోకు సమర్పించారు. ఆ డేటాపై కమిటీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ముక్కు మార్గం ద్వారా వేసే టీకాతో.. వైరస్ ఎంట్రీ ప్రాంతమైన ముక్కు వద్ద బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థను రూపొందించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఈ టీకాతో వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. ఎటువంటి సూది అవసరం లేకుండా ఈ టీకాను ఇవ్వవచ్చు. BBV154 టీకాను.. చింపాంజీలోని అడినోవైరస్ ద్వారా డెవలప్ చేశారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్స్తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను తయారు చేస్తున్నది.