న్యూఢిల్లీ: దేశంలో పలురాష్ట్రాల్లో కరెంటు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో బొగ్గు కొరత వల్లే ఇలా కరెంటు కష్టాలు తలెత్తాయని పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలకు బొగ్గు పంపిణీ చేయాలని తన లేఖలో ఆయన కోరారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. దేశంలో ఎటువంటి బొగ్గు కొరత లేదని కేంద్ర పవర్ మంత్రి ఆర్కే సింగ్ తేల్చిచెప్పారు.
ఈ విషయంలో అనవసరంగా భయోత్పాతం సృష్టిస్తున్నారని, కొందరు నేతలపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రకటనపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. ఏప్రిల్, మే నెలల్లో దేశంలో క్సిజన్ కొరత ఏర్పడిన సమయంలో కూడా కేంద్రం ఇలాగే మాట్లాడిందని సిసోడియా విమర్శించారు. ‘‘అప్పుడు ఆక్సిజన్ కొరత లేదన్నారు. ఇప్పుడు బొగ్గు కొరత లేదంటున్నారు. మా ముఖ్యమంత్రి లేఖ రాసుండకూడదంటూ ఈ సంక్షోభాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ సిసోడియా ఆగ్రహం వ్యక్తంచేశారు.
గుజరాత్, పంజాబ్. రాజస్థాన్. ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాలు బ్లాకవుట్ ఆందోళనలు లేవనెత్తాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలకు బొగ్గు సరఫరా జరిగేలా చూడాలని కోరారు. ఈ బొగ్గు కొరత కారణంగా బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రోజుకు 14 గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారు.
అయితే దీనికి కారణం బొగ్గు కొరత కాదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఎకానమీ పునరుద్ధరణతో పెరిగిన ఎలక్ట్రిసిటీ డిమాండ్, బొగ్గు గనుల ప్రాంతాల్లో భారీ వర్షాలు, బొగ్గు దిగుమతి ధరలు పెరగడంతోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బొగ్గు కంపెనీలు భారీ రుణాల్లో ఉండటం వంటి కారణాల వల్లే పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయని ప్రభుత్వం తెలిపింది.